అగ్రిగోల్డ్ డిపాజిట్లరకు కాసేపటి క్రితమే నగదు జమ చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… దాదాపుగా 7లక్షల పైచిలుకు డిపాజిటర్లకు 666.84 కోట్లు ఇస్తున్నామని… మొత్తంగా అగ్రిగోల్డ్ డిపాజిటర్లు 10.4 లక్షల మందికి రూ.905.57 కోట్లకు పైగా ఆర్థిక సహాయం చేశామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం బాధితులకు న్యాయం చేశామని… రూ.20వేల లోపు డిపాజిట్ చేసిన కుటుంబాలు అన్నింటికీ.. కనీసం ఆ రూ.20వేలైనా తిరిగి ఇచ్చేసే కార్యక్రమం ఈరోజుతో పూర్తిచేస్తున్నామన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారం కొలిక్కి రాగానే మిగిలిన డిపాజిటర్లకు చెల్లింపులు ఉంటాయని సీఎం పేర్కొన్నారు.
ఒక ప్రైవేటు కంపెనీ మోసం చేసి ఎగ్గొట్టిన డబ్బును ప్రభుత్వం చెల్లించటం దేశంలో ఎక్కడా జరుగలేదని తెలిపారు. 2015లోనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి మోసం చేశారని… అగ్రిగోల్డ్ గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల కోసం జరిగిన స్కామ్ అని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ ఆస్తులను ఏవిధంగా కొట్టేయాలనుకున్నారో గతంలో అసెంబ్లీలో చెప్పామని… ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరిలో జీవో ఇచ్చి రూపాయి కూడా గత ప్రభుత్వం చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.