వైసీపీ అధినేత జగన్ హైదరాబాదులోని ప్రశాంత్ కిశోర్ కార్యాలయానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్, ప్రశాంత్ కిశోర్ ల మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి. తాను చేపట్టిన పాదయాత్రను క్షేత్ర స్థాయి వరకు విజయవంతంగా తీసుకెళ్లారంటూ పీకేకు జగన్ కితాబిచ్చారు. ప్రజల్లోకి వెళ్లడం వల్లే వైసీపీ అధికారంలోకి రాబోతోందని అన్నారు. కష్టపడి పని చేస్తే 2024లో కూడా మనం అధికారంలోకి వస్తామని చెప్పారు. వైసీపీ కోసం ఎంతో శ్రమించినందుకు పీకే టీమ్ కు ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ, ఏపీలో అద్భుతమైన పాలనను అందించేందుకు జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పారు. తన ముందు ఫ్యూచర్ సీఎం ఉన్నారంటూ తన సంస్థ ఐప్యాక్ సిబ్బందికి జగన్ ను పరిచయం చేశారు. దేశంలోనే బెస్ట్ సీఎంగా సేవలందించాలని జగన్ కు శుభాకాంక్షలు చెప్పారు.