టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పై నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. మరో వైపు ఏపీ సీఎం జగన్ పై ప్రశంసలు కురిపింక్చారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ, సీఎం జగన్, విపక్షనేత చంద్రబాబులపై వ్యాఖ్యలు చేశారు. జగన్ ను నమ్మిన ప్రజలు 151 సీట్లతో గెలిపించారని, చంద్రబాబును ఛీకొట్టి 23 సీట్లతో సరిపెట్టారని పేర్కొన్నారు. బాలలు వెట్టిచాకిరీ చేయకుండా బాలకార్మిక వ్యవస్థను రూపుమాపాలని భావించిన జగన్ అమ్మ ఒడి పథకం తీసుకువస్తే, ఆ పథకాన్ని చూసి ఓర్వలేని చంద్రబాబు దుష్ప్రచారానికి తెరలేపారని రోజా మండిపడ్డారు.
ఓటమి తాలూకు అసహనంతో చంద్రబాబు ప్రతిదాన్నీ వివాదం చెయ్యాలని చూస్తున్నారని రోజా ఆరోపించారు. పాదయాత్రలో తాను చూసిన ప్రజల కష్టాలు తొలగిపోయే విధంగా సీఎం జగన్ బడ్జెట్ రూపొందించారని అన్నారు. బడ్జెట్ పై చర్చ జరిగితే చంద్రబాబును ప్రజలు అసహ్యించుకుంటారని అన్నారు. చంద్రబాబు తన ఐదేళ్లపాలనలో రైతులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే, జగన్ పొరుగు రాష్ట్రాల నుంచి 3.5 లక్షల క్వింటాళ్ల విత్తనాలు కొనుగోలు చేసి రైతులకు అందించాడని కితాబిచ్చారు.