టీవీ షోలలో ఒక్కసారిగా ఏదో ఒక గొడవ మొదలవుతూ ఉంటుంది. అదంతా కావాలని టీఆర్పీల కోసం చేస్తున్నదేనని ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు. అయితే టీఆర్పీల కోసం కన్న కొడుకు పెళ్లి గురించి అబద్ధం చెప్పారు ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్. తెలుగులో ఎన్నో సూపర్హిట్ పాటలు పాడి ఫేమస్ అయిన ఉదిత్ కుమారుడు ఆదిత్య కూడా మంచి సింగరే. ఆదిత్యతో పాటు ప్రముఖ బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్.. ‘ఇండియన్ ఐడల్’ అనే ఫేమస్ సింగింగ్ షోకి జడ్జ్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే రెండువారాల క్రితం ఈ షోకి ఉదిత్ నారాయణ్ తన భార్యతో కలిసి వచ్చారు. తన కుమారుడు ఆదిత్యను నేహా కక్కర్కి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నట్లు షోలోనే ప్రకటించి అందరికీ షాకిచ్చారు. అంతేకాదు నేహా, ఆదిత్య కలిసి వ్యాలెంటైన్స్ వీక్ సందర్భంగా గోవాకు వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చారు. దాంతో నిజంగానే వీరి పెళ్లి జరుగుతోందని అంతా అనుకున్నారు. కానీ ఇదంతా టీఆర్పీల కోసం తాను ఆడిన నాటకం అని మీడియా ముందు అసలు విషయం చెప్పారు ఉదిత్ నారాయణ్. “ఆదిత్య మాకు ఒక్కగానొక్క కొడుకు. త్వరలో వాడు పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది. కానీ నేను మొన్న చెప్పిందంతా అబద్ధమే. వాడు జడ్జ్గా చేస్తున్న షో టీఆర్పీలు పెరగాలని నేహాతో పెళ్లి అని చెప్పాను. కానీ నేను చెప్పిన అబద్ధం నిజమైతే బాగుంటుంది అనిపిస్తోంది. నేహా మంచి అమ్మాయి. మాది సింగర్స్ ఫ్యామిలీ కాబట్టి మాకు కాబోయే కోడలు కూడా సింగర్ అయితే అంతకన్నా మాకు ఇంకేం కావాలి” అని వెల్లడించారు. అయితే టీఆర్పీల కోసం ఇలాంటి అబద్ధాలు చెప్పడం ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.
previous post
next post