క్రికెట్ పండుగ ఐపీఎల్ కు సమయం ఆసన్నమైంది. నేటి నుంచే ఐపీఎల్ 12వ సీజన్ ఆరంభం కానుంది. ఇక క్రీడాలోకమంతా ఐపీఎల్ ఫీవర్తో మునిగిపోనుంది. నాలుగేళ్లకోసారి వచ్చే వన్డే ప్రపంచకప్ కన్నా ఏడాదికోసారి వచ్చే ఐపీఎల్ పైనే ఆసక్తి పెరిగింది. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)మధ్య చెన్నై చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ సందర్భంగా ఆయా ఆటగాళ్ల గురించి..
విరాట్కోహ్లీ ఐపీఎల్లో ఇప్పటి వరకు జడేజా బౌలింగ్లో 96 బంతుల్లో 104 పరుగులు చేశాడు. అలాగే మూడుసార్లు ఔటయ్యాడు. టీ20ల్లో కోహ్లీ స్ట్రైక్రేట్ 133.71 కాగా జడ్డూ బౌలింగ్లో 108.33గా ఉంది. ఇద్దరూ అండర్ 19 స్థాయి నుంచే కలిసి క్రికెట్ ఆడుతున్నారు. ఈ సీజన్లో వీరిలో ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారో చూడాల్సి ఉంది.
దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్. ఆర్సీబీలో కోహ్లీ తర్వాత చెప్పుకోదగ్గ బ్యాట్స్మన్ ఇతడే. డివిలియర్స్పై హర్భజన్ని ప్రయోగించాలని సూపర్ కింగ్స్ ఆలోచన. టీ20ల్లో డివిలియర్స్ స్ట్రైక్రేట్ 148.36 కాగా.. హర్భజన్ బౌలింగ్లో 135.21గా ఉంది. భజ్జీ బౌలింగ్లో మొత్తం 71 బంతుల్లో 96 పరుగులు చేసి రెండుసార్లు ఔటయ్యాడు.
ఈ ఏడాది మంచి ఫామ్లోకి వచ్చిన ధోనీ ఐపీఎల్లో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. మరోవైపు ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ ఉమేశ్యాదవ్ సహాయంతో ధోనీని కట్టడి చేయాలని భావిస్తున్నాడు. ఉమేశ్యాదవ్పై 126.92 స్ట్రైక్రేట్ కలిగిన ధోనీ ఒక్కసారి మాత్రమే ఔటయ్యాడు. కొత్త బంతితో బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టగల నేర్పరి ఉమేశ్యాదవ్. ఈ నేపథ్యంలో ధోనీ ఆరు ఓవర్ల వరకూ బ్యాటింగ్ చేసేందుకు ముందుకు రాకపోవచ్చని తెలుస్తోంది.
సూపర్ కింగ్స్ జట్టులో ప్రధాన ఆటగాడు సురేశ్ రైనా. మూడో స్థానంలో బరిలో దిగే రైనా ఇదివరకు ఐపీఎల్లో చాహల్ బౌలింగ్లో నాలుగుసార్లు ఔటయ్యాడు. దీంతో మొదటి మ్యాచ్లో రైనా క్రీజులోకి వస్తే కోహ్లీ చాహల్ చేతికి బంతి అందించే అవకాశముంది. ఏదేమైనా రైనాకు చాహల్ బౌలింగ్లో 139.34 మంచి స్ట్రైక్రేటే ఉంది.
చెన్నై జట్టులో అత్యంత ప్రమాదకర బ్యాట్స్మెన్లో షేన్వాట్సన్ ఒకరు. ఫాస్ట్ బౌలర్లపై విరుచుకుపడే వాట్సన్కు ఆర్సీబీ స్పిన్ బౌలర్ పవన్నేగీతో చేదు అనుభవమే మిగిలింది. ఇప్పటివరకూ మొత్తంమీద 21 బంతుల్లో 24 పరుగులు చేసి మూడుసార్లు అతడి బౌలింగ్లోనే ఓటయ్యాడు. దీంతో వాట్సన్ త్వరగా క్రీజులోకి వస్తే పవన్ చేతికి బంతి దొరికే అవకాశముంది.