telugu navyamedia
క్రీడలు వార్తలు

తొలి క్వాలిఫయర్ లో విజయం ఎవరిది..?

ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టు.. తొలి టైటిల్‌ కోసం ఆరాటపడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ తుదిపోరుకు నేరు గా చేరడమే లక్ష్యంగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ రోజు ఐపీఎల్‌ 13వ సీజన్‌ తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ఇరు జట్ల మధ్య జరుగనుంది. వరుసగా నాలుగు ఓటములు చవిచూసినా లీగ్ ‌దశ చివరి మ్యాచ్‌లో బెంగళూరుపై గెలిచి ఢిల్లీ మళ్లీ పుంజుకోగా.. టాప్‌లో ఉన్నా గత మ్యాచ్‌లో హైదరాబాద్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో రోహిత్‌సేన ఘోరంగా ఓడింది. క్వాలిఫయర్‌-1లో ఓడిన జట్టుకు ఫైనల్‌ చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌ విజేతతో జరిగే క్వాలిఫయర్‌-2లో గెలిస్తే తుదిపోరుకు చేరవచ్చు. గాయం కారణంగా నాలుగు మ్యాచ్‌లకు దూరమైన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మళ్లీ జట్టులోకి రావడం ముంబై ఇండియన్స్‌కు పెద్ద బలం. ఇక గత మ్యాచ్‌లో రోహిత్‌ విఫలమైనా.. ఒక్కసారి గాడిలోకి పడితే అతడి జోరుకు తిరుగుండదు. మరోవైపు ఇషాన్‌ కిషన్‌, డికాక్‌, సూర్య కుమార్‌ యాదవ్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. చివర్లో హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌, కృనాల్‌ బిగ్‌ హిట్టింగ్‌ చేయగల సమర్థులు. బౌలింగ్‌లో ముంబై మరింత బలంగా ఉంది. భారత యార్కర్‌ స్టార్‌ బుమ్రా, కివీస్‌ స్పీడ్‌స్టర్‌ బౌల్ట్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో వారికి విశ్రాంతినివ్వగా.. ఢిల్లీతో మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నారు. స్పిన్నర్లు రాహుల్‌ చాహర్‌, కృనాల్‌ తమ బాధ్యతకు న్యాయం చేస్తున్నారు. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది చూడాలి.

Related posts