ఐపీఎల్ 2020 సీజన్ పాయింట్ల పట్టికలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ మళ్లీ టాప్లోకి దూసుకొచ్చింది. టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్లోనే పేలవంగా ఓడిపోయిన ముంబయి టీమ్.. ఆ తర్వాత చిన్న తడబాటు కనబర్చినా.. చివరిగా ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఘన విజయాలతో మళ్లీ నెం.1 స్థానానికి ఎగబాకింది. రాజస్థాన్ రాయల్స్తో అబుదాబి వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసిన ముంబయి టీమ్.. ఆ తర్వాత ఛేదనకు దిగిన రాజస్థాన్ని 18.1 ఓవర్లలోనే 136 పరుగులకి ఆలౌట్ చేసింది. దాంతో ఆ జట్టు నెట్ రన్రేట్ కూడా గణనీయంగా పెరిగింది. ముంబయి తర్వాత పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్రైడర్స్ జట్లు టాప్-4లో కొనసాగుతుండగా.. ఇటీవల పంజాబ్పై విజయం సాధించి మళ్లీ గెలుపు బాట పట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఐదో స్థానంలో ఉంది. ఇక బౌలింగ్ బలహీనత కారణంగా గత ఆదివారం ముంబయి చేతిలో ఓడిన సన్రైజర్స్ హైదరాబాద్ ఆరులో నిలవగా.. మంగళవారం రాత్రి ఓడిన రాజస్థాన్ ఏడులో ఉంది. ఇక ఆఖరిగా ఐదు మ్యాచ్లాడి ఒక మ్యాచ్లో మాత్రమే గెలుపొందిన పంజాబ్ చిట్టచివరి స్థానంలో ఉంది. లీగ్ దశలో ప్రతి జట్టూ మిగిలిన ఏడు జట్లతో రెండేసి మ్యాచ్లను ఆడనుండగా.. కనీసం 8 మ్యాచ్ల్లో గెలిచిన జట్లు ప్లేఆఫ్కి అర్హత సాధించనున్నాయి.
#MumbaiIndians back on top after Match 20 of #Dream11IPL pic.twitter.com/QoKzS1MLS3
— IndianPremierLeague (@IPL) October 6, 2020