కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్లో గత కొద్ది రోజుల నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు మసీదుల్లో ప్రార్థనలు ముగిసిన అనంతరం సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసే అవకాశం ఉందని ఆ రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ వెల్లడించారు. యూపీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
యూపీలోని 75 జిల్లాలకు గానూ 21 జిల్లాల్లో పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశామన్నారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. కేంద్ర బలగాలను సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించామని తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించే అంశంపై ఆలోచిస్తామని డీజీపీ చెప్పారు. తాము అమాయకులను ముట్టుకోవడం లేదు. హింస, ఆందోళనలకు ప్రేరేపిస్తున్న వ్యక్తులను మాత్రమే అదుపులోకి తీసుకుంటున్నామని పేర్కొన్నారు.