ఇంటర్ విద్యార్థినిని ఓ యువకుడు బండరాయితో కొట్టి, భవనం పై నుంచి కిందకు పడేశాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రెండు రోజుల క్రితం హైదరాబాద్లోని వారాసిగూడలో చోటు చేసుకుంది. పోలీసులు కేసును ఛేదించి ఈ రోజు వివరాలు వెల్లడించారు. నిందితుడు షోయబ్, హత్యకు గురైన విద్యార్థిని చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకున్నారని చెప్పారు.
ప్రస్తుతం షోయబ్ ఫ్లెక్సీ బోర్డ్ డిజైనర్గా పని చేస్తున్నాడని, తన స్నేహితురాలిని పెళ్లి చేసుకుంటానని ఇటీవల ఆమె కుటుంబ సభ్యులకు చెప్పాడు. అయితే, బాలిక మైనర్ కావడంతో ఆ బాలిక తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. అనంతరం షోయబ్తో ఆమె మాట్లాడట్లేదు.బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత బాలిక ఇంటికి షోయబ్ వచ్చాడు.
ఆమెతో మాట్లాడాలని చెప్పి బాలికను భవనంపైకి తీసుకెళ్లాడు. అక్కడ మాట్లాడుకుంటూ ఇద్దరూ గొడవపడ్డారు. దీంతో షోయబ్ ఓ బండరాయితో ఆమె తలపై కొట్టి, ఈడ్చుకుంటూ వెళ్లి భవనంపైనుంచి కిందకు తోసేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ మేరకు పోలీసులు నిందితుడు షోయబ్ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.