తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాల్లో జరిగిన గందరగోళంతో రాష్ట్రంలో సుమారు 23 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటాలాడుతున్న ఇంటర్ బోర్డు తీరుపై ఏబీవీపీ కార్యకర్తలు కదంతొక్కారు. ఫలితాల వెల్లడిలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ర్యాలీగా బయల్దేరి ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. గేటు దూకి లోపలికి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో భారీ సంఖ్యలో అక్కడి చేరుకున్న పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో విద్యార్థులను అరెస్టు చేశారు.
కాగా ఇంటర్మీడియట్ బోర్డులో నేటికీ సాంకేతిక తప్పిదాలు దొర్లుతూనే ఉన్నాయి. రోజుకో రకమైన సమస్యలు బయటకు వస్తూనే ఉన్నాయి. వార్షిక పరీక్షల ఫలితాల్లో సాంకేతిక తప్పిదాలతో విద్యార్థుల మార్కుల జాబితాల్లో అనేక తప్పులు ఇచ్చిన ఇంటర్ బోర్డు.. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్టికెట్లలోనూ సాఫ్ట్వేర్ సంస్థ పొరపాట్లు చేసింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.