తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు ఇంటెలిజెన్స్ పోలీసులు నోటీసులిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనాల వినియోగంపై రోజువారీ అద్దె, డ్రైవర్ భత్యం కింద రూ.9 లక్షలు చెల్లించాలని జానారెడ్డితో పాటు షబ్బీర్ అలీకి రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్(ఐఎస్డబ్ల్యూ)విభాగం శనివారం నోటీసులందించింది. 2007లో సీఈసీ ఆదేశాల ప్రకారం బుల్లెట్ వాహనాలు వినియోగించినవారందరికీ నోటీసులు పంపించినట్టు ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన సెప్టెంబర్ 6 నుంచి డిసెంబర్ 7వరకు జానారెడ్డి, షబ్బీర్ అలీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఉపయోగించారని నోటీసుల్లో పేర్కొన్నారు.
షబ్బీర్ అలీ ఈ కోడ్ కాలంలో 12,728 కి.మీ వాహనంలో ప్రయాణించారని, ఇందుకు గాను ప్రతీ కిలోమీటర్కు రూ.37లతో పాటు డ్రైవర్ భత్యం రోజు వారీరూ.100లతో కలిపి మొత్తంగా రూ.4,79,936 చెల్లించాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ మంత్రి జానారెడ్డి కోడ్ అమల్లో ఉండగా 11,152 కి.మీలు ప్రయాణించారని, ఇందుకు గాను రూ.4,20,924 చెల్లించాలని పేర్కొన్నారు. ఇద్దరు నేతలు కలిపి మొత్తంగా రూ.9,00,860 చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.