*కేరళ తీరంలోఇవాళ నవ శకం ప్రారంభమైంది..
*కొచ్చిన్ లో బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం..
*విక్రాంత్ ద్వారా 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను తీసుకెళ్లొచ్చు.
*భారత నౌకదళ అమ్ముళపొదిలో మరో అస్ర్తం
*దేశియంగా తయారు చేసిన తొలి ఎయిర్ క్రాప్ట్ క్యారియర్..
*విక్రాంత్ తయారీకి మొత్తం 20వేల కోట్ల రూపాయల ఖర్చు
కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్లో పూర్తి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన అత్యాధునిక యుద్దనౌక ఐఎన్ఎస్ విక్రాంత్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భారత అమ్ముల పొదిలోకి చేరింది.
కేరళలోని కొచ్చి షిప్యార్డ్లో ఈ యుద్దనౌకను మోదీ.. జాతికి అంకితమిచ్చారు. బాహుబలి యుద్ధనౌకగా పేరుగాంచిన.. ఐఎన్ఎస్-విక్రాంత్ రాకతో హిందూ మహాసముద్ర జలాల్లో గస్తీ మరింత పటిష్ఠం కానుంది.
సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కేరళ తీరంలో ఈ రోజు నవశకం ప్రారంభమైందని తెలిపారు. అమృతోత్సవ వేళ ఐఎన్ఎస్ నౌక ప్రవేశం శుభపరిణామమన్నారు. భారత్కు సాధ్యం కానిది ఏదీ ఉండదని, ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకను చూసి ప్రతి భారతీయుడు గర్వించాలని అన్నారు.
కాగా ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించనుంది. దీని తయారీకి 13 ఏళ్ల సమయం పట్టగా.. రూ.20 వేల కోట్లు ఖర్చయ్యింది .
262 మీటర్ల పొడవు, 62 వెడల్పు కలిగిన ఉన్న ఈ విక్రాంత్ నౌక బరువు 37,500 టన్నులు , గంటకు గరిష్ఠంగా 28 నాటికల్మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో మొత్తం 14 అంతస్తులు, 2300 కాంపార్ట్మెంట్స్ ఉన్నాయి. విధుల్లో 1600 మంది సిబ్బంది ఉంటారు.
ఈ నౌకలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ తరహా వైద్య సదుపాయాలున్నాయి. రెండు ఆపరేషన్ థియేటర్లు, ల్యాబొరేటరీలు, వార్డులు, ఐసీయూలు, ఒక సీటీ స్కాన్మెషీన్ ఉన్నాయి.
అంతేకాదు ఇందులో ఐదుగురు వైద్య అధికారులు, 15 మంది ఆరోగ్య సిబ్బంది పనిచేస్తారు .గాయపడిన సైనికులకు వైద్య సేవలు అందించేందుకు 16 పడకలతో చిన్నపాటి ఆసుపత్రిని నిర్మించారు.
ఇప్పటిదాకా భారత్ వద్ద ఉన్న యుద్ధ నౌకలన్నీ బ్రిటన్, రష్యాల నుంచి దిగుమతి చేసుకున్నవే. అలాంటిది అగ్రదేశాలే ఆశ్చర్యపోయేలా అత్యాధునిక విమానవాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ విజయవంతంగా నిర్మించింది.
ఈ సామర్థ్యమున్న అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ సరసన సగర్వంగా తలెత్తుకుని నిలిచింది. 42,8000 టన్నుల సామర్థ్యంతో రెండు టేకాఫ్ రన్వేలు, ఒక ల్యాండింగ్ స్ట్రిప్లతో క్షిపణి దాడిని తట్టుకునేలా నిర్మించారు. గత ఏడాది ట్రయల్స్ విజయవంతంగా ముగిశాయి. చైనాతో ఉద్రిక్తత నెలకొన్న వేళ ఆత్మనిర్భర్ భారత్కు ఊతమిస్తూ నిర్మించిన ఈ బాహుబలి యుద్ధనౌకను ప్రధాని నరేంద్ర మోదీ కొచ్చి తీరంలో నావికాదళానికి అప్పగించనున్నారు.