విదేశీ బాట పడుతున్నవారిలో భారతీయులు ఎక్కువగా ఉన్నారని తాజా సర్వే స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకు వలసవెళ్లే వారిలో మన దేశానికి చెందిన వారే అగ్రస్థానంలో ఉన్నారు. సుమారు 1.74 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో ఉంటున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మెక్సికో (1.18 కోట్లు), చైనా (1.07 కోట్లు), రష్యా (1.05 కోట్లు) ఉన్నాయి. ప్రపంచంలో మొత్తం 27.2 కోట్ల మంది వలసప్రజలు ఉండగా, అందులో భారతీయులు సుమారు 6% మంది ఉన్నారు. ది ఇంటర్నేషనల్ మైగ్రెంట్ స్టాక్-2019 పేరిట ఐక్యరాజ్యసమితి ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా వలసప్రజల జనాభా 2010లో 2.21 కోట్లు ఉండగా, ప్రస్తుతం అది 23 శాతానికిపైగా పెరిగింది.
ప్రపంచం మొత్తం జనాభాలో వలస ప్రజలు 2000లో 2.8% ఉండగా, ప్రస్తుతం అది 3.5 శాతానికి చేరింది. ఎక్కువ మంది అమెరికా (5.1 కోట్లు), జర్మనీ (1.3 కోట్లు), సౌదీఅరేబియా(1.3కోట్లు) వలస వెళ్తున్నారని పేర్కొంది. 2015లో భారత్లో 52 లక్షల మంది వలసజనం ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 51 లక్షలకు తగ్గిందని నివేదిక వెల్లడించింది. భారత్కు వలస వచ్చిన వారిలో శరణార్థులు సుమారు 4 శాతం ఉన్నారు.