అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారత్కు ఇన్నాళ్లూ కల్పించిన ప్రాధాన్యతా వాణిజ్య హోదాను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఇది అమలులోకి రానున్నది. జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్(జీఎస్పీ) ప్రోగ్రామ్ నుంచి భారత్ను తొలగించాలన్న అభిప్రాయాన్ని ట్రంప్ గతంలోనే వెల్లడించారు. ప్రాధాన్యతా వాణిజ్య హోదా కింద ఇన్నాళ్లూ భారత వస్తువులకు అమెరికాలో ప్రత్యేక పన్నులు ఉండేవి కావు.
తమ వస్తువులకు సమాన హోదా ఇచ్చే అంశంపై భారత్ ఇంత వరకు ఎటువంటి హామీ ఇవ్వలేదని, అందుకే జూన్ 5వ తేదీ నుంచి ప్రిఫరెన్షియల్ బెనిఫిషియరీ హోదాను రద్దు చేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. భారత్కు ఉన్న వాణిజ్య హోదాను రద్దు చేయరాదంటూ అమెరికా ప్రతినిధులు చేసిన విజ్ఞప్తులను కూడా ట్రంప్ పట్టించుకోలేదు. గతంలో ఇచ్చిన 60 రోజుల నోటీసు సమయం దాటిపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.