భారతదేశంలో న్యాయం ఎంత త్వరగా జరుగుతుందో ఈ ఒక్క కేసు చూసి తెలుసుకోవచ్చు. నిజానికి ఇలాంటివి గతంలో కూడా బోలెడు, అయినా తాజాగా ఈ కేసు అందరిని మరోసారి ఆశ్చర్యపరిచింది. అందుకే దేశంలో నేరాలు ఘోరంగా పెరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటేనే ఈ పరిస్థితిలో మార్పులు వచ్చి, అందరికి న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం కలుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇక తాజా కేసు వివరాలు చుస్తే, 20 రూపాయలు దొంగతనం చేశాడని వేసిన కేసును 41 సంవత్సరాలకు గ్వాలియర్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ శనివారం పరిష్కరించింది. వివరాల్లోకి వెళ్తే.. బాబులాల్ (61) అనే వ్యక్తి 41 ఏళ్ల కిందట అంటే 1978లో బస్సులో టిక్కెటు కోసం నిల్చుని ఉండగా ఇస్మయిల్ ఖాన్(68) అనే వ్యక్తి తన జేబులోంచి రూ.20 దొంగిలించాడని కేసు పెట్టాడు.
అప్పట్లో ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగా మళ్లీ కొన్ని నెలల తర్వాత అతను బెయిల్ మీద విడుదలయ్యాడు. ఆ తర్వాత తరచూ కోర్టు విచారణకు హాజరవుతూ వచ్చాడు. కానీ 2004 సంవత్సరం నుంచి అతను కోర్టు విచారణకు హాజరవడం మానేయడంతో తాజాగా 2019 ఏప్రిల్లో అతన్ని అరెస్టు చేయమని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో గత మూడు నెలలుగా ఖాన్ జైల్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఖాన్ కుటుంబం ఆర్థికంగా పేదరికంలో ఉండడంతో అతనికి బెయిల్ ఇప్పించేందుకు ఎవరూ రాలేదు. దీంతో మళ్లీ ఇద్దరినీ పిలిపించి లోక్అదాలత్లో విచారణ చేపట్టిన జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ మళ్లీ ఇలాంటి నేరాలు చేయకుండా రాతపూర్వక హామీ పత్రాన్ని తీసుకుని ఖాన్ను విడుదల చేసింది.