పాక్ ఆక్రమిత కశ్మీర్ స్వాధీనం పై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా సైన్యం ఎల్లవేళలా సిద్ధంగానే ఉందని ఆర్మీ చీఫ్ రావత్ అన్నారు. ప్రభుత్వం ఆదేశం మేరకు దేశంలోని సంస్థలు పనిచేస్తాయన్నారు. పీవోకేను తిరిగి భారతదేశంలో కలిపేందుకు సైన్యం ఎప్పుడూ సిద్ధంగానే ఉందని రావత్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం 100 రోజులపాలనపై ఇటీవల జమ్మూలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జితేంద్ర సింగ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ 100 రోజుల పాలనలో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకొన్నారని, అందులో అధికరణ 370 రద్దు ప్రభుత్వం సాధించిన గొప్ప విజయాల్లో ఒకటని ఆయన చెప్పారు. కాశ్మీర్లో త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అన్నారు.
కాశ్మీర్పై తీసుకొన్న నిర్ణయంతో ఆ రాష్ట్రంలో పారిశ్రామికీకరణ జరిగి భారీ స్థాయిలో యువతకు ఉద్యోగవకాశాలు లభిస్తాయని అన్నారు. కాశ్మీర్ విషయంలో ప్రపంచ దేశాలు భారత్కు మద్దతుగా నిలిచాయన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)ను భారత భూభాగంలో కలపడమే కేంద్ర ప్రభుత్వం తదుపరి ఎజెండా అని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి పీవీ నర్సింహారావు హయాంలోనే పార్లమెంటు ఏకగ్రీవ తీర్మానం చేసిందని గుర్తు చేశారు. భారత్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో తెలుసని, వాటిని పరిష్కరించే దిశగా తమ పాలన కొనసాగుతోందన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందన్నారు.