ప్రపంచ కప్ లో భాగంగా ఆఫ్గనిస్తాన్ తో తలపడ్డ భారత్ భారీ స్కోర్ చేస్తుందనుకొన్న అభిమానులను నిరాశ పరిచినప్పటికీ, గెలుపు సొంతం చేసుకొని మరో విజయం ఖాతాలో వేసుకుంది. ఇక వరుసగా మూడు వికెట్లు తీసి మహమ్మద్ షమీ నిజంగా అదరహో అనిపించాడు. హ్యాట్రిక్ సాధించి భారత్కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. వరల్డ్ కప్ మ్యాచ్లలో హ్యాట్రిక్ సాధించిన రెండో ఇండియన్ బౌలర్గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో ఇండియా ఆఫ్గనిస్థాన్పై 11 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో భారత్దే పై చేయి అయింది. సౌతాంప్టన్లోని ది రోజ్బౌల్లో ఇవాళ ఆఫ్గనిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 224 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ కోహ్లి (63 బంతుల్లో 67 పరుగులు, 5 ఫోర్లు), కేదార్ జాదవ్ (68 బంతుల్లో 52 పరుగులు, 3 ఫోర్లు, 1 సిక్సర్)లు మాత్రమే రాణించారు.
ఆఫ్గన్ బౌలర్లలో గుల్బదీన్ నయీబ్, మహమ్మద్ నబీలకు చెరో 2 వికెట్లు దక్కగా, ముజీబ్ ఉర్ రహమాన్, ఆఫ్తాబ్ ఆలం, రషీద్ ఖాన్, రహ్మత్ షాలకు తలా 1 వికెట్ దక్కింది. స్వల్ప లక్ష్యం తో ఆఫ్గనిస్థాన్ నిలకడగా ఆడే ప్రయత్నం చేసింది. ఓ దశలో మ్యాచ్ ఆఫ్గనిస్థాన్కు అనుకూలంగా మారింది. అయినప్పటికీ కీలకమైన దశలలో వికెట్లను కోల్పోవడంతో ఆఫ్గనిస్థాన్ 49.5 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయి ఓటమి పాలైంది. చివర్లో షమీ హ్యాట్రిక్తో భారత్ విజయం సాధించింది. కాగా ఆఫ్గనిస్థాన్ బ్యాట్స్మెన్లలో మహమ్మద్ నబీ (55 బంతుల్లో 52 పరుగులు, 4 ఫోర్లు, 1 సిక్సర్) మాత్రమే రాణించాడు. ఇక భారత బౌలర్లలో షమీ 4 వికెట్లు తీయగా, బుమ్రా, చాహల్, పాండ్యాలు తలా 2 వికెట్లు తీశారు.