స్మార్ట్ఫోన్ వినియోగించడంలో అగ్రరాజ్యం అమెరికాను దాటేసి మన దేశం రెండో స్థానానికి దూసుకెళ్లింది. ప్రపంచంలో చైనా తరువాత భారత్ రెండో అతిపెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్గా అవతరించింది. ఈ విషయాన్ని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అనే సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం ఈ మార్కెట్లో అమెరికా మూడో స్థానానికి పడిపోయింది. 2019లో మన దేశంలో 158 మిలియన్ల స్మార్ట్ఫోన్ ఎగుమతులు, దిగుమతులు జరిగాయి. అంతకుముందు ఏడాది అంటే.. 2018తో పోల్చి చూసుకుంటే ఇది 7 శాతం అధికం. ఫలితంగా స్మార్ట్ఫోన్ విపణిలో అమెరికాను తోసిరాజంటూ మన దేశం సెకండ్ ప్లేస్ను ఆక్రమించింది. మన స్మార్ట్ఫోన్ మార్కెట్లో చైనా బ్రాండ్లు మరోసారి తమ సత్తా చాటాయి. 2019లో అమ్ముడైన మొత్తం ఫోన్లలో చైనా ఫోన్ బ్రాండ్లదే అత్యధిక వాటా. 2018లో చైనా బ్రాండ్ల వాటా 60 శాతం కాగా.. ఇది 2019లో మరింత పెరిగి 72 శాతానికి చేరింది.
చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ 28 శాతం మార్కెట్ షేర్తో మరోసారి అగ్రస్థానం దక్కించుకుంది. దీని తరువాత శామ్సంగ్ 21 శాతం, వివో 16 శాతం, రియల్ మీ 10 శాతం, ఒప్పో 9 శాతం వాటి దక్కించుకున్నాయి. 2019 నాలుగో త్రైమాసికంలో మాత్రం చైనా స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో రాణించింది. ఈ రేసులో మొట్టమొదటిసారి దక్షిణ కొరియా దిగ్గజం శామ్సంగ్ను దాటేసి రెండో స్థానం దక్కించుకుంది. నాలుగో త్రైమాసికంలో అమ్ముడైన మొత్తం స్మార్ట్ఫోన్లలో చైనా బ్రాండ్ వివో మార్కెట్ వాటా 21 శాతంగా ఉంది. దీంతో షావోమీ తరువాత ఇన్నాళ్లూ రెండో స్థానంలో కొనసాగిన శామ్సంగ్.. తాజాగా 19 శాతం వాటాతో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు చైనా మరో బ్రాండ్ షావోమీ 27 శఆతం వాటాతో ఈ రేసులో తొలిస్థానంలో కొనసాగుతున్నట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తన నివేదికలో తెలిపింది.