లోక్సభ ఎన్నికలు జరిగితే ఎలాంటి ఫలితాలు వస్తాయనే దానిపై దేశవ్యాప్తంగా ఇండియా టుడే- కార్వీ ఇన్సైట్స్ సర్వే నిర్వహించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని సర్వేలో వెల్లడైంది. ఎన్డీఏ కూటమికి మెజారిటీ తగ్గుతుందని ఇండియా టుడే- కార్వీ ఇన్సైట్స్ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్’లో స్పష్టమైంది. ఈరోజు 2014 ఎన్నికలతో పోలిస్తే ఎన్డీఏకు 99 సీట్లు తగ్గే అవకాశముందని సర్వే అంచనా వేసింది. 237 సీట్లు మాత్రమే గెలిచే అవకాశముందని తెలిపింది.
గత ఎన్నికలతో పోలిస్తే యూపీఏ కూటమి భారీగా పుంజుకోనుంది. యూపీఏ 166 సీట్లు దక్కించుకునే అవకాశముంది. 2014తో పోలిస్తే యూపీఏకు అదనంగా 106 సీట్లు జతకానున్నయి. ఎన్డీఏ, యూపీఏలో భాగస్వాములు కాని పార్టీలు 140 స్థానాల్లో విజయం సాధిస్తాయని సర్వే తేల్చింది. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా సర్వే ఫలితాలు కమలనాథులను కలవరపెడుతున్నాయి.