భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టులో పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్లో 275 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. అంతకుముందు భారత్ శుక్రవారం 601/5 వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేయగా 326 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంకా రెండు రోజుల ఆటమిగులున్న నేపథ్యంతో టీమిండియా కెప్టెన్ సఫారీలను ఫాలోఆన్ ఆడిస్తాడా లేక బౌలర్లకు విశ్రాంతినిచ్చి రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ కొనసాగిస్తాడా అనే విషయం తేలాల్సి ఉంది. ఇప్పటికే భారత బౌలర్లు 106 ఓవర్ల పాటు బౌలింగ్ చేయడంతో వారికి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తే ఆదివారం నాలుగో రోజు బ్యాటింగ్ చేసి దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం నిర్దేశించే అవకాశముంది.
శనివారం ఓవర్నైట్ స్కోర్ 36/3తో తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన దక్షిణాఫ్రికా మ్యాచ్ ప్రారంభమైన అరగంటకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. షమి వేసిన మూడో ఓవర్లో నైట్వాచ్మెన్ నోర్జె(3) నాలుగో స్లిప్లో ఉన్న కోహ్లీ చేతికి చిక్కాడు. కుడివైపు నుంచి కిందగా వెళ్తున్న బంతిని కోహ్లీ డైవ్చేస్తూ చక్కటి క్యాచ్ అందుకున్నాడు. మరికాసేపటికే ఉమేశ్యాదవ్ బౌలింగ్లో డిబ్రుయిన్(30) కూడా కీపర్ చేతికి చిక్కాడు. ఔట్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి తొలి స్లిప్లో దూసుకెళ్లినా వికెట్కీపర్ సాహా అమాంతం డైవ్చేస్తూ అదిరిపోయే క్యాచ్ అందుకున్నాడు.