పుల్వామాలో పాక్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మహుతి దాడిలో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడిలో పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు లభించకపోవడంతో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శాంతి చర్చలకు సిద్ధమని పేర్కొన్న సంగతి తెలిసిందే. సరైన ఆధారాలు లభిస్తే పుల్వామా ఘటన విషయంలో విచారణ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో పుల్వామా ఉగ్రదాడికి సంబంధించిన పలు ఆధారాలను భారత ప్రభుత్వం పాకిస్తాన్కు అందజేసింది. 40 మందికి పైగా భారత జవాన్లను హతమార్చిన తర్వాత ఉగ్రవాదులతో జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ మాట్లాడిన టేపులను పాక్ అధికారులకు పంపించింది. కాగా పుల్వామా దాడిని సమర్థవంతంగా అమలు చేసినందుకు తన అనుచరులను మసూద్ అభినందించాడు. తాను అప్పగించిన పనిని విజయవంతంగా నిర్వహించినందుకు వారిని ప్రశంసించాడు. ఇందుకు సంబంధించిన ఆడియో టేపులను పాక్ అధికారులకు ఇచ్చిన భారత్ తక్షణమే మసూద్పై చర్యలు తీసుకోవాలని ఆల్టిమేటం జారీ చేసింది.