telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

నేడే .. భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య తొలి టీ20…

india-bangladesh t20 today

భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య తొలి టీ20కి అరుణ్‌ జైట్లీ మైదానం ఆతిథ్యమివ్వనుంది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌కు మంచు, వాయు కాలుష్యం ఇతరత్రా సమస్యలున్నా… మ్యాచ్‌ను సజావుగా సాగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చివరి నిమిషంలో మ్యాచ్‌ను మరో వేదికకు మార్చాలనుకున్నపటికీ అది సాధ్యం కాకపోవడంతో భారత్‌-బంగ్లాదేశ్‌ జట్లు ఇక్కడ మ్యాచ్‌కు సన్నద్ధమయ్యాయి. తొలి టీ20కి వాయు కాలుష్య ప్రభావం ఆటగాళ్లపై పెద్దగా ప్రభావం చూపదని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అభిప్రాయపడగా, బంగ్లాదేశ్‌ కోచ్‌ డొమింగో కూడా దాదాపు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్‌ జట్టుకు షకీబ్‌, తమీమ్‌ ఇక్బాల్‌ దూరం కాగా… భారతజట్టుకు కోహ్లీ, బుమ్రాతోపాటు సీనియర్‌ పేస్‌ బౌలర్లు దూరంగా ఉన్నారు. విరాట్‌ విశ్రాంతి తీసుకోవడంతో జట్టు పగ్గాలు రోహిత్‌ శర్మ మరోసారి అందుకున్నాడు. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగే తొలి మ్యాచ్‌పైనే అందరి దృష్టి నెలకొంది. ఫిరోజ్‌షా కోట్లా మైదానం పేరును అరుణ్‌ జైట్లీ మైదానంగా పేరు మార్చాక ఈ వేదికపై జరిగే తొలి మ్యాచ్‌ ఇదే.

తేమ నేపథ్యంలో పిచ్‌ తొలుత పేసర్లకు అనుకూలించినప్పటికీ… చివర్లో స్పిన్నర్ల ప్రభావం చూపించగలరు. అయితే మంచు కీలకం కాబట్టి అధిక మంచు కురిస్తే మాత్రమే బంతిపై బ్యాట్స్‌మన్‌కు పట్టు దొరికే అవకాశం లేదు. ఈ మైదానంలో ఇప్పటివరకూ 5 టీ20లు జరగ్గా.. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు 3సార్లు విజయాలను నమోదు చేసుకొంది. అంతేగాక ఈ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు భారత్‌ పేర ఉంది. ఈ వేదికలో న్యూజిలాండ్‌పై తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 3 వికెట్లు కోల్పోయి 202 పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. బంగ్లాదేశ్‌ జట్టు విషయానికొస్తే… పరాజయం అంచున నిలిచినా స్థైర్యం కోల్పోని ఆటగాళ్లకు పుట్టినిల్లు ఆ జట్టు. టీ20 క్రికెట్‌ ఫార్మాట్‌లో మాత్రం భారత్‌పై ఆ జట్టుకు గొప్ప రికార్డేమీ లేదు. భారత్‌తో ఎనిమిదిసార్లు బంగ్లా తలపడి అన్నింట్లోనూ పరాజయాలనే చవిచూసింది. కాకపోతే ఆ జట్టుతో భారత్‌ ఇప్పటి వరకూ ద్వైపాక్షిక సిరీస్‌ ఆడకపోవడం గమనార్హం.

Related posts