పాకిస్థాన్ లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పుడక్కడ 4 వేలకుపై కరోనా బాధితులున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ మున్ముందు ఈ పరిస్థితిని తట్టుకోవడం కష్టమేనని, పరిస్థితి మరింత దిగజారవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పాక్ లో పాక్షికంగానే లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.
దేశంలో 5 కోట్లకు పైగా పేదలున్న నేపథ్యంలో పూర్తిస్థాయి లాక్ డౌన్ విధిస్తే ఆకలి చావులు సంభవిస్తాయని ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఆరోగ్యశాఖ సూచనలు పాటించాలని హితవు పలికారు. కాగా, పాక్ లో కరోనా తీవ్రతతో సామాన్యులు ఇక్కట్లు ఎదుర్కొంటుండడంతో ప్రభుత్వం ‘ఎహసాస్ ఎమర్జెన్సీ క్యాష్ ప్రోగ్రామ్’ ప్రకటించింది. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు నెలకు రూ.12 వేల చొప్పున ఇవ్వనున్నారు.