ఇప్పటి వరకు భారత్, పాక్ ను ఉపేక్షించింది. కానీ పుల్వామా ఘటనతో సహనం నశించినట్టుగానే ఉంది. దీనితో ఆ దేశంతో ఉన్న అన్ని సంబంధబాంధవ్యాలను తెంచుకునేందుకు పూనుకుంటుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ నుంచి వివిధ రకాల సరుకులు మోసుకుని వస్తున్న లారీలకు వాఘా సరిహద్దు వద్ద బ్రేక్ పడుతోంది. లారీల ప్రవేశానికి అనుమతించక పోవడంతో అట్టారి-వాఘా సరిహద్దులో వాహనాలు బారులు తీరుతున్నాయి.
జమ్ముకశ్మీర్ రాష్ట్రం పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషేఅహ్మద్ సభ్యుడు దాడి చేసిన ఘటన అనంతరం పాకిస్థాన్ నుంచి సరుకుల దిగుమతిని భారత్ నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నిషేధం వల్ల ఇబ్బందులున్నా భారత్ ప్రభుత్వ నిర్ణయానికి తాము మద్దతు ఇస్తున్నామని వ్యాపారులు ప్రకటించారు. సరుకు దిగుమతి కోసం తాము ఇచ్చిన అడ్వాన్స్లు తిరిగి చెల్లించాలని పాక్ వ్యాపారులను కోరినట్లు రాజ్దీప్, ఉప్పల్ అనే దిగుమతిదారులు తెలిపారు. ప్రస్తుతం సరిహద్దులో దాదాపు 250 లారీలు ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నాయని సమాచారం.