తనను బెదిరిస్తున్నారంటూ ఇళయరాజా ఎల్.వి.ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్పై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇళయరాజా, ప్రసాద్ స్టూడియో వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తన స్టూడియోను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, బెదిరిస్తున్నారని ఇళయరాజా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రసాద్ స్టూడియోస్ వ్యవస్థాపకుడు ఎల్.వి.ప్రసాద్ ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాపై గౌరవంతో స్టూడియోలో ఓ ప్రత్యేకమైన గదిని కానుకగా ఇచ్చారు. ఈ రికార్డింగ్ స్టూడియోలో ఇళయరాజా నాలుగు దశాబ్దాలుగా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఎల్.వి.ప్రసాద్ తనయుడు రమేశ్ ప్రసాద్ ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. కానీ మనవడు సాయిప్రసాద్ మాత్రం స్టూడియో స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.