నిర్మల్ జిల్లాలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గత 7 రోజులుగా క్యాంపస్లో చేస్తున్న నిరసనలకు శుభం కార్డు పడింది. విద్యార్థులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి జరిపిన చర్చలు సఫలం కావటంతో.. విద్యార్థులు తమ ఆందోళనను విరమిస్తున్నట్లు ప్రకటించారు. నేటి నుంచి తరగతులకు హాజరవుతామని విద్యార్థులు వెల్లడించారు.
సోమవారం అర్ధరాత్రి విద్యాశాఖ కార్యదర్శి, ఉన్నత విద్యామండలి వైఎస్ చైర్మెన్లతో పాటు పలువురు విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లారు. ఈ చర్చల్లో ట్రిపుల్ ఐటీ డైరెక్టర్, నిర్మల్ జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ తరఫున ప్రతినిధులు హాజరయ్యారు.రాత్రి 9.30 నుంచి రెండున్నర గంటలకుపైగా ఈ చర్చలు జరిగాయి.
మంత్రితో చర్చల అనంతరం బయటకు వచ్చిన విద్యార్థులు అర్ధరాత్రి స్థానిక మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.తమ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో తాము ఆందోళన విరమిస్తున్నామని తెలిపారు.
మొత్తం 12 డిమాండ్లు పరిష్కరిస్తామని ప్రభుత్వం తరఫున మంత్రి సబిత ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. మౌలిక సౌకర్యాలకు తక్షణమే రూ.5.6 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. నిర్ణీత గడువులోగా డిమాండ్ల పరిష్కారానికి హామీ లభించింది. రెగ్యులర్ వీసీ నియామకానికి స్పష్టమైన హామీ ఇచ్చారు. ట్రిపుల్ ఐటీకి ఛాన్స్లర్ను నియమిస్తామన్నారు. తమపై నేతలు, అధికారుల నుంచి ఎలాంటి ఒత్తిడి రాలేదని విద్యార్థులు తెలిపారు.
టీఆర్ఎస్ అవినీతిపై బీజేపీ మాట్లాడటం సంతోషకరం: జీవన్ రెడ్డి