దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) మరోసారి రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఐసీఎంఆర్ స్పష్టమైన మర్గదర్శకాలు జారీ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. కరోనా నిర్ధారణ చేయడానికి కేవలం ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు మాత్రమే చేయాలని స్పష్టం చేసింది. ర్యాపిడ్ యాంటీ బాడీ టెస్టులు చేయొద్దని సూచించింది.
అనుమానితుల ముక్కు, గొంతు నుంచి తీసుకునే స్వాబ్ ఆధారంగా మాత్రమే పరీక్షలు చేయాలని ఐసీఎంఆర్ తెలిపింది. మనుషుల్లో రోగ నిరోధక శక్తి ఎంత ఉందో తెలుసుకోవడానికే యాంటీ బాడీ టెస్టులని చెప్పింది. ఆర్టీ-పీసీఆర్ కిట్ట స్థానంలో యాంటీ బాడీ టెస్టింగ్ కిట్లు వినియోగించకూడదని స్పష్టం చేసింది. దేశంలోని రాష్ట్రాలన్నీ ఐసీఎంఆర్ ప్రొటోకాల్ను అనుసరించాలని సూచించింది.