ప్రయివేట్ బ్యాంకింగ్ రంగ సంస్థల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంకుత్వరలో ఖాతాదారులకు షాక్ ఇవ్వనుంది. ఈనెల 15 నుంచి ఛార్జీల మోత మోగించడానికి సిద్ధమౌతోంది. ఈ మేరకు ఆ సంస్థ అధికారిక వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది. నూతన నిర్ణయం వల్ల సేవింగ్ ఖాతాల నగదు లావాదేవీలపై ప్రభావం చూపనుంది. రోజువారీ నగదు డిపాజిట్, విత్ డ్రా, ఇతర లావాదేవీలపై ఈ చార్జీల వర్తింపు ఉంటుందని తెలిపింది. తాము విధించిన పరిమితికి మించి జరిపే లావాదేవీలపై అదనంగా రుసుము వసూలు చేయడం జరుగుతుందని బ్యాంకు స్పష్టం చేసింది.
నెలకు 4 సార్లు నగదు లావాదేవాలు ఉచితంగా చేసుకోవచ్చు, అంతకు మించితే 150 రూపాయలు వసూలు చేస్తారు. తమ ఖాతా ఉన్న బ్రాంచి నుంచి 2 లక్షల రూపాయల వరకూ ఉచితంగా లావాదేవీలు (డిపాజిట్ లేక విత్ డ్రా) చేసుకోవచ్చునని పేర్కొనడం ద్వారా ఖాతా దారులకు కొంత ఊరటను కలిగించింది. అలాగే రోజువారీ లావాదేవీల్లో భాగంగా రూ.25 వేల వరకు ఉచిత పరిమితిని ప్రకటించింది. అంతకు మించితే వెయ్యి రూపాయలకు గాను రూ.5 లేదా కనీసం రూ.150 ఛార్జీ ఉంటుందని పేర్కొంది.