telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పరామర్శ పేరుతో రౌడీయిజం చేస్తానంటే నోరు మూయిస్తా: సీఎం చంద్రబాబు

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ పొదిలి టూర్‌ చుట్టూ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ విపక్షానికి చంద్రబాబు ఏకంగా వార్నింగ్‌ ఇచ్చారు.

రౌడీయిజం చేస్తే నోరు మూయించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉందని, ఇక్కడుంది సీబీఎన్‌ అంటూ ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు అన్నారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత పొదిలి పర్యటనను ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు విశాఖ జిల్లా కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆయన మాట్లాడుతూ పొగాకు రైతుల పరామర్శ పేరుతో జగన్ రౌడీ రాజకీయం చేస్తున్నారని, పొదిలి పర్యటనలో అడ్డొస్తే తొక్కేస్తామని పొదిలిలో ప్లకార్డులు ప్రదర్శించారని, మీరు ఎవరిని తొక్కేస్తారు? ఇక్కడుంది CBN అంటూ పేర్కొన్నారు.

పరామర్శ పేరుతో రౌడీయిజం చేస్తానంటే నోరు మూయిస్తామంటూ హెచ్చరించారు.

ఇంకా సీఎం చంద్రబాబు మట్లాడుతూ  “జగన్ నాటకాల రాయుడు ఆయన రాజకీయాలన్నీ నాటకాలే. రాజకీయం అంటే తమాషా కాదు. మోసాలు, నేరాలు చేసి ఎదుటి వారి మీద వేయడం కాదు.

తెల్లారితే ఎన్నికలు అనగా బాబాయ్‌ని లేపేశారు. గుండెపోటని చెబితే.. సాయంత్రానికి గొడ్డలి పోటని తేలింది. కోడికత్తి నాటకమే  గులకరాయి నాటకమే” అంటూ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు.

ఎక్కడికెళ్లినా రాష్ట్రంలో ఓ భూతం ఉందని, ఆ భూతం మళ్లీ వస్తే ఎలా అని అడుగుతున్నారు, ఆ భూతాన్ని రాజకీయంగా శాశ్వతంగా భూస్థాపితం చేశా అని చంద్రబాబు అన్నారు.

Related posts