అధిక ధరలతో ప్రజలు అల్లాడిపోతుంటే అటు కేంద్ర , ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. దళితులు, శ్రామికులు, ఓబీసీలు, పేదప్రజలు, మైనారిటీలు, బ్రాహ్మణులను బీజేపీ వంచిస్తోందని, మోసం చేస్తోందని అన్నారు. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా గోరఖ్పూర్లో ఆదివారం నిర్వహించిన ప్రతిజ్ఞా ర్యాలీలో బీజేపీపై నిప బీజేపీ పాలనపై నిప్పులు చెరిగారు. ప్రజలను వర్గాలుగా విడదీసి వారిపై రోజూవారి దాడులకు పాల్పడుతోందని అన్నారు.
ఉత్తరప్రదేశ్లో ప్రజల కష్టాలను సీఎం యోగి పట్టించుకోవడం లేదన్నారు. ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ప్రశంసిస్తున్నారని, కాని ఆయన పక్కనే మంత్రి అజయ్ మిశ్రా లాంటి క్రిమినల్స్ ఉన్నవిషయాన్ని మర్చిపోయారని మండిపడ్డారు. రైతులను తన కాన్వాయ్తో తొక్కించిన మంత్రి స్వేచ్చగా తిరుగుతున్నారని ప్రియాంక విమర్శించారు.
యూపీలో ఎస్పీ, బీఎస్పీ లాంటి విపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై పోరాటంలో విఫలమయ్యాయని, బీజేపీకి తొత్తుగా కాంగెస్ మారిందని ఆ పార్టీలు విమర్శిస్తున్నాయని, కాని ప్రతి అంశంపై యూపీలో కాంగ్రెస్ పార్టీనే పోరాడుతోందని ప్రియాంక అన్నారు. తన ప్రాణం పోయినా సరే బీజేపీతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని ప్రియాంకాగాంధీ స్పష్టం చేశారు.
‘‘పంచదారకు ఇన్ని రోజులు కనీస మద్దతు ధర ఇవ్వలేదు. అలాంటిది ఉన్నపళంగా ఇప్పుడెందుకు మద్దతు ధర ఇస్తామని ప్రకటించారు? నాలుగున్నరేళ్ల పాటు ధరలు పెంచి ఇప్పుడు ఒక్కసారిగా తగ్గించడం కేవలం ఎన్నికల కోసమేగా? పేదప్రజలను బీజేపీ ఎంత మోసం చేయాలో అంతగా మోసం చేసింది, వంచించిందని అన్నారు.