telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఈ నెల 3న రాజ్‌భవన్ లోనే మోడీ బస ..4వేల మందితో భారీ భ‌ద్ర‌త

తెలంగాణ‌లో రేపు, ఎల్లుండి జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రేపు హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 3వ తేదీ రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.

తొలి రోజు (శనివారం) నోవాటెల్ హోటల్ లోనే ప్రధాని బస చేయనుండగా.. 3వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే ప్రధాని మోదీ బహిరంగ అనంతరం ఆయన రాజ్ భవన్ కు చేరుకుంటారని, రాజ్‌భవన్‌లో ప్రధాని బస చేస్తారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.

శుక్రవారం బీజేపీ నేతలతో కలసి పరేడ్ గ్రౌండ్స్‌లో భద్రత ఏర్పాట్లను సీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ.. ప్రధాని బస సందర్భంగా రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. హెచ్ఐసీసీ, బేగంపేట, రాజ్ భవన్ మార్గాల్లో దాదాపు 4 వేల పోలీసులతో పహారా ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో 3 వేల మంది పోలీసులతో పహారా కాస్తారని చెప్పారు.

ప్రధాని, సీఎంలు, కేంద్రమంత్రులు సభకు హాజరవుతున్న దృష్ట్యా ఆక్టోపస్, గ్రేహౌండ్స్, తెలంగాణ పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు సీపీ ఆనంద్‌ వెల్లడించారు. డీఐజీ, ఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారులను ఇంచార్జ్‌లుగా నియమించామన్నారు.

Related posts