తెలంగాణలో మరోసారి ఎన్నికల హడావుడి మొదలైంది. నల్లగొండ జిల్లా హుజుర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్ ఖారైంది. ఈ నేపథ్యంలో హుజుర్నగర్ అసెంబ్లీ టీఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో శానంపూడి సైదిరెడ్డి హుజుర్నగర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఆయనకే మరోసారి సీఎం అవకాశమిచ్చారు.
2018 ముందస్తు ఎన్నికల్లో నల్గొండ జిల్లా హుజుర్నగర్ అసెంబ్లీ స్థానానికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2019 లోక్సభ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ స్థానానికి పోటీ చేసి విజయం సాధించిన విషయం విదితమే. దీంతో ఖాళీ అయిన హుజుర్నగర్ అసెంబ్లీ స్థానానికి అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరుపుతున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరా ప్రకటించారు.