బంగ్లాదేశ్ రాజధాని లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 19 మంది చనిపోగా.. దాదాపు 70 మంది గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. ఇరుకుడా ఉండే బనాయ్ అనే కమర్షియల్ ప్రాంతంలోని ఎఫ్ఆర్ టవర్స్ అనే ఎత్తయిన భవనంలో ఈ ప్రమాదం సంభవించింది. వెంటనే రంగంలోకి దిగిన సైనిక, అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఎత్తయిన భవనం కావడంతో ఇంకా కొన్ని చోట్ల మంటలు చెలరేగుతున్నాయని.. వాటిని ఆర్పే ప్రయత్నం ముమ్మరంగా జరుగుతోందని అగ్నిమాపక అధికారులు తెలిపారు.
మంటల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కొంతమంది కిటికీల్లోంచి బయటకు వస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి మరణించినట్లు స్థానికులు తెలిపారు. చాలా మంది భవనం పైకి చేరకోవడంతో భారీ క్రేన్లు, సైనిక హెలికాప్టర్ల సాయంతో వారిని రక్షించారు. దట్టమైన పొగలు అలముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. రెండో అంతస్తు నుంచి మొదట మంటలు చెలరేగినట్లు అక్కడి స్థానికులు తెలిపారు.
ఇప్పటి వరకు ప్రమాదానికి గల అసలు కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై వెంటనే విచారణ ప్రారంభిస్తామని అక్కడి పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో భద్రతా నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించడం వల్లే తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గత నెల ఢాకాలోని ఓ రసాయన గిడ్డంగిలో జరిగిన ప్రమాదంలో 67 మృతి చెందిన విషయం తెలిసిందే.