శీతాకాంలో వచ్చిందంటే చాలు కొంతమందిని కాళ్ళ పగ్గుళ్ళు వీపరీతంగా బాధిస్తుంటుంది. కొందరికైతే కాలంతో సంబంధం లేకుండా కాళ్ల పగళ్లు ఇబ్బంది పెడుతుంటాయి. చాలా మంది దీనిని పెద్ద సమస్యగా చూడరు. అవే తగ్గిపోతాయిలే అని పట్టించుకోవడం మానేస్తారు.
ముఖ్యంగా శీతాకాలంలో ముఖ చర్మం, చేతులకు కోల్డ్ క్రీమ్స్, మాయిశ్చరైజర్ రాసుకుంటూ పొడిబారే చర్మాన్ని తేమగా ఉంచుకుంటారు. కానీ పాదాల సంరక్షణను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ సౌదర్యం సంరక్షణలో పాదాల రక్షణ ఒకటి అని చెప్పడంలో సందేహం లేదు.
రోజుల తరబడి పాదాల ఆరోగ్యాన్ని విస్మరించడం వల్ల పగుళ్లు ఏర్పడి కొత్త సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. పగుళ్లలో బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మ క్రిములు చేరితే ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీనివల్ల చీము పట్టడం, దుర్వాసన వంటివి కూడా వేదిస్తాయి. అలర్జీల వల్ల పాదాల వద్ద ఉండే సున్నితమైన చర్మంపై దద్దుర్లు, పాదాల వాపు, చర్మం పైతోలు లేచిపోవడం వంటి అనారోగ్యాలు ఎదురవుతాయి. చివరకు నడవటానికి కూడా రానంతగా కాళ్ల పగుళ్లు ఇబ్బంది పెట్టే స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.
నిమ్మరసంతో..
చర్మం రఫ్గా మారడం పగుళ్లకు దారి తీస్తుంది. నిమ్మలోని ఆమ్ల గుణాలు రఫ్గా మారిన చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. వెచ్చటి నీటిలో నిమ్మరసం కలిపి పాదాలను పావు గంటపాటు అందులో ఉంచాలి. తర్వాత మడమల్ని రుద్దేసి.. కడిగేశాక.. పొడిగా ఉండే వస్త్రంతో తుడవాలి.
చిటికెడు పసుపుతో..
పాదాల పగుళ్లు వచ్చిన వారు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో చెంచా ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఆ నీటిలో పాదాలను పది నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచి పెట్రోలియం జెల్లీని రాసుకుంటే పగుళ్లు తగ్గుతాయి.
రోజ్ వాటర్, గ్లిజరిన్ మిశ్రమంతో..
గ్లిజరిన్, రోజ్ వాటర్ మిశ్రమంతోనూ మడమల పగుళ్లను తొలగించొచ్చు. ఈ రెండింటిని సమపాళ్లలో కలిపి రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు మడమలు, పాదాలకు రాయాలి. రోజూ ఇలా చేయడం వల్ల పగుళ్లు తగ్గిపోతాయి.
*రాత్రి పడుకోవడానికి ముందు కాళ్లకు కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె రాసి మర్దనా చేయాలి. రోజూ ఇలా చేయడం వల్ల కాళ్ల పగుళ్లు తగ్గుముఖం పడతాయి.
*శుభ్రం చేసిన సాక్సులను ప్రతిరోజూ కాళ్లకు వేసుకోవాలి. ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరగాలి.
*వ్యాసిలిన్, నిమ్మరసం కలిపి.. ఆ రెండింటి మిశ్రమాన్ని కాళ్లు పగిలిన దగ్గర రాయాలి. క్రమంతప్పకుండా ఇలా చేయాలి.
*కాళ్లు పగిలిన ప్రాంతంలో కలబంద గుజ్జును రాసినా కూడా ప్రయోజనం ఉంటుంది. కాళ్లు ముందుగా శుభ్రం చేసుకొని తర్వాత పాదాలు తుడుచుకొని ఆ తర్వాత కలబంద గుజ్జు రాయాల్సి ఉంటుంది. అలా వారానికి ఐదు రోజులు చేస్తే ప్రయోజనం కనపడుతుంది.
*మూడు టీస్పూన్స్ ఓట్స్ లో ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి కలపాలి. దీనిని పాదాలకు మాస్క్ లాగా వేసి.. తర్వాత దానిమీద అల్యూమినియం ఫాయిల్ తో చుట్టాలి. గంట తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.. రెగ్యులర్ గా ఇలా చేయడం వల్ల సమస్య తగ్గుముఖం పడుతుంది.