హోటల్ లో బిల్లు కోసం మొదలైన గొడవ ఓ యువకుడిని బలితీసుకునే వరకు వెళ్ళింది. రూ.180 బిల్లు కోసం హోటల్ యజమాని, అతడి సిబ్బంది 25 ఏళ్ల ఓ యువకుడిని కొట్టి చంపారు. ఉత్తర ప్రదేశ్లోని భదోని జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఎస్పీ రామ్ బదన్ సింగ్ కథనం ప్రకారం.. బుధవారం సాయంత్రం సురాజ్ సింగ్, విశాల్ దూబే అనే ఇద్దరు యువకులు మహరాజ్గంజ్ సమీపంలోని సర్దార్ ధాబాకి వెళ్లి భోజనం తిన్నారు. అనంతరం హోటల్ సిబ్బంది రూ.180 బిల్లు చేతిలో పెట్టడంతో ఎక్కువ బిల్లు వేశారంటూ యువకులు హోటల్ యజమాని గుర్మైల్ సింగ్, సురేంద్ర సింగ్లతో వాగ్వాదానికి దిగారు.
మాటామాటా పెరగడంతో హోటల్ యజమాని, అతడి కుమారుడు తమ సిబ్బంది సహాయంతో కర్రలు, రాడ్లతో సురాజ్ సింగ్, విశాల్ దూబేలను తీవ్రంగా కొట్టారు. దూబే అక్కడి నుంచి పారిపోయి తప్పించుకోగా… వారంతా సురాజ్పై దాడిచేయడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు ఎస్పీ రామ్ బదన్ సింగ్ వెల్లడించారు. హోటల్ యజమానిని ఇప్పటికే అరెస్టు చేశామనీ.. పారిపోయిన మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.