వెన్నెముకలో వస్తున్న భరించలేని నొప్పితో ఓ యువతి హైద్రాబాద్ నిమ్స్ లో చేరింది. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు విస్తుపోయారు. ఆమె శరీరంలో ఓ బుల్లెట్ ఉందని గుర్తించి, దాన్ని బయటకు తీశారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్, ఫలక్ నుమా ప్రాంతంలో ఇక్కడ నివాసం ఉంటున్న ఓ యువతి కుట్టుమిషన్ కుట్టుకుంటూ జీవనం సాగిస్తుంది. మూడు నెలలుగా వెన్నెముకలో నొప్పిగా ఉండటంతో ఆసుపత్రిలో చేరింది.
వివిధ పరీక్షల తరువాత, ఆమె శరీరంలో గాయం ఉందని తేల్చిన వైద్యులు, ఆపరేషన్ చేయగా, బుల్లెట్ బయటపడింది. ఇది కనీసం మూడేళ్ల నుంచి ఆమె శరీరంలో ఉండి ఉండవచ్చని వైద్యులు తేల్చారు. ఆపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.