ఈ ఘటన అమెరికాలోని మిస్సోరిలో ఆదివారం చోటు చేసుకుంది. ఆడమ్ స్మిత్ (37) అనే వ్యక్తి తల్లి ఊపిరితిత్తుల క్యాన్సర్తో జూలై 21న చనిపోయింది. గత 20 ఏళ్లుగా ఆమె సెయింట్ లూయిస్లోని ఇంట్లోనే నివాసముంది. అయితే తల్లి చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఆమె ఆరోగ్యం బాగా లేకపోవడంతో బాగోగులు చూసుకోవడానికి స్మిత్ సెయింట్ లూయిస్ వెళ్లాడు. అయితే, తల్లి వద్ద స్మిత్కు చిన్నప్పటి నుంచి ఓ బాక్సు ఫ్రీజ్లో దాచి పెట్టి ఉంచడం కనిపించింది. తల్లి బతికినన్ని రోజులు ఆమెతోనే ఉందా బాక్స్. దాదాపు 37 ఏళ్లుగా ఆ బాక్సును తనతోనే భద్రంగా దాచి పెట్టుకుంటూ వచ్చిందామె. స్మిత్తో కూడా ఎప్పుడు అందులో ఏముందో చెప్పలేదు. ఇక ఆదివారం(జూలై 21న) తల్లి చనిపోవడంతో అంత్యక్రియలు ముగిసిన అనంతరం ఇంటిని శుభ్రం చేసే పనిలో పడ్డాడు స్మిత్. ఇంతలో అతడికి గత నాలుగు దశాబ్దాలుగా తల్లి దాచి పెడుతున్న బాక్స్ గుర్తొచ్చింది. ఫ్రీజర్ వద్దకు వెళ్లి అందులో తల్లి దాచి పెట్టిన బాక్సును ఓపెన్ చేసి చూశాడు. అందులో ఉన్న దాన్ని చూసి స్మిత్ షాకయ్యాడు. బాక్సులో అతడికి మృతశిశువు కనిపించింది. ఆ శిశువుకు ఇప్పటికీ చర్మం, జుట్టు ప్రతిదీ అలాగే ఉన్నాయి. దాన్ని చూసిన స్మిత్ కాసేపటికి తేరుకొని పోలీసులకు సమాచారం అందించాడు. స్మిత్ సమాచారంతో అక్కడికి చేరుకున్న సెయింట్ లూయిస్ పోలీసులు శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఈ ఘటనపై అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ శిశువు ఏవరిది.. ఎందుకు తన తల్లి గత కొన్ని సంవత్సరాలుగా దాన్ని దాచి పెట్టిందనే విషయాలు ఇప్పుడు స్మిత్కు మిస్టరీగా మారాయి. పోలీసులు కూడా ఈ విషయమై విచారణ చేపట్టారు.