telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

100 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహ ప్రతిష్టాపనకు స్థలం మంజూరు చేయడానికి అంగీకరించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు

హైదరాబాద్‌లో, ప్రత్యేకించి ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు గారి 100 అడుగుల విగ్రహం ప్రతిష్టాపనకు మరియు ఎన్టీఆర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం ప్రభుత్వపరంగా స్థలం కేటాయించడానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌ రెడ్డి గారు అంగీకరించడం ఎంతో సంతోషం.

ఈరోజు ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్సీ శ్రీ టి.డి.జనార్థన్‌, ఎన్టీఆర్‌ కుమారుడు శ్రీ నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్‌ లిటరేచర్‌ సభ్యులు శ్రీ మధుసూదన రాజు గార్లు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారితో కలిసి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్‌ రెడ్డి గారిని కలవడం జరిగింది.

ఈ సందర్భంగా, గత ఏడాదిన్నర కాలంగా ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చేపట్టిన కార్యక్రమాలను శ్రీ టి.డి.జనార్థన్‌ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌ రెడ్డికి వివరించారు.

హైదరాబాద్‌లో 100 అడుగుల ఎత్తుతో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని నెలకొల్పాలన్న తమ సంకల్పాన్ని వివరించి, దానితోపాటు ఎన్టీఆర్‌ నాలెడ్జి సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని; ఓ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనుకొంటున్నామని.. ఇందుకుగాను తెలంగాణ ప్రభుత్వం తరఫున స్థలాన్ని కేటాయించి సహకరించాలని శ్రీ టి.డి.జనార్థన్‌, శ్రీ నందమూరి రామకృష్ణలు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌ రెడ్డిని కోరారు.

ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకొన్న సీఎం శ్రీ రేవంత్‌ రెడ్డి అభినందించారు.

ఎన్టీఆర్‌ తెలుగు ప్రజలందరికీ ఇష్టమైన నటుడు, నాయకుడని.. ఆయన 100 అడుగుల విగ్రహం హైదరాబాద్‌లో ప్రతిష్టించాలన్న ప్రతిపాదనకు తమవంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌ రెడ్డి సానుకూల స్పందనకు ఎన్టీఆర్‌ అభిమానులందరూ సంతోషిస్తారని పేర్కొంటూ ఆయనకు ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ తరఫున తమ కృతజ్ఞతను, ధన్యవాదాలను శ్రీ టి.డి.జనార్ధన్‌ తెలియజేశారు.

(డి.రామ్మోహన్‌ రావు)
వైస్‌ చైర్మన్‌

Related posts