తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి హోం మంత్రి మెహమూద్ అలీకి అనుమతి నిరాకరించారు. లోపలికి అనుమతి లేదని ప్రగతి భవన్ సిబ్బంది చెప్పడంతో ఆయన వెనక్కు వెళ్లిపోయారు. అయితే డీజీపీ మహేందర్ రెడ్డికి అనుమతి ఉండటంతో సమావేశానికి అనుమతించారు.
ఈ సమీక్ష సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో పలు అంశాల పై సీఎం చర్చిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్డౌన్ అమలు, ఇతర అంశాలపై సమావేశంలో సీఎం చర్చించినట్టు సమాచారం.