బాలీవుడ్ ఇటీవల టాలీవుడ్ చిత్రాల రీమేక్ లతో కనిచేస్తుంది. తాజాగా, పవర్స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ‘కాటమరాయుడు’ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారు. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ఇందులో హీరోగా నటించనున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. తొలుత ఈ పాత్రలో అక్షయ్ కుమార్ను ఎంపిక చేసుకోవాలనకున్నారు. కానీ అక్షయ్ ఇతర ప్రాజెక్ట్లతో బిజీగా ఉండటంతో విక్కీని సంప్రదించారట.
అన్నీ అనుకున్నట్లు కుదిరితే సినిమాకు సాజిద్ నదియాద్వాలా నిర్మాతగా వ్యవహరిస్తారు. అంతేకాదు సినిమాకు ‘ల్యాండ్ ఆఫ్ లుంగీ’ అనే ఫన్నీ టైటిల్ను ఖరారు చేయాలని చిత్రబృందం అనుకుంటోంది. దీని గురించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 2017లో వచ్చిన ‘కాటమరాయుడు’ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలు అందుకుంది. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటించారు. తమిళంలో అజిత్ నటించిన ‘వీరం’కు ఈ సినిమా రీమేక్గా వచ్చింది.