ఏపీలో రాజకీయాలు అట్టుడికిపోతున్నాయి. తెదేపా, వైకాపా నేతలు పోటీ పోటీన నిరసనలు తెలుపుతున్నారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అనుచిత వ్యాఖ్యలకు భగ్గుమన్న వైకాపా శ్రేణులు తెలుగుదేశం ప్రధాన కార్యాలయం, నాయకులపై దాడులకు చేశారు.
దీంతో వైకాపా దాడులకు నిరసనగా తెలుగుదేశం రాష్ట్ర బంద్ పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ తెదేపా నేతలు నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందస్తుగా అప్రమత్తమైన పోలీసులు ఏపీ వ్యాప్తంగా ఎక్కడికక్కడ తెలుగుదేశం నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు.
పలుచోట్ల రోడ్లపై నిరసనకు దిగుతున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలిస్తున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.