కేంద్ర మంత్రివర్గం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారికి భారీగా వాత పెట్టే మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం.. ఇప్పటిదాకా విధిస్తున్న జరిమానాలు ఇక మీదట రెట్టింపు కానున్నాయి. పిల్లల చేతికి తాళాలిచ్చి వారు నడిపినట్లు గనక తేలితే వారి తలిదండ్రులకు లేదా సంరక్షకులకు 25వేల రూపాయల జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. సదరు సంరక్షకుడి డ్రైవింగ్ లైసెన్సు కూడా రద్దు చేస్తారు.
మద్యం సేవించి వాహనం నడిపితే రూ 10,000 జరిమానా కట్టాలి. అత్యవసర సర్వీసులకు, అంబులెన్సులకు వెన్వెంటనే దారివ్వాలి. లేదా రూ 10,000 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్సు లేకుండా చట్టవిరుద్ధంగా వాహనం నడిపితే రూ 5000, ప్రమాదకర డ్రైవింగ్కు రూ 5000, హెల్మెట్ లేకుండా నడిపితే రూ 1000 జరిమానా మాత్రమే కాకుండా మూడు నెలల పాటు లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. రవాణా శాఖ ఇచ్చిన ఏ ఆదేశాలనైనా ఉల్లంఘించినట్లు తేలితే కనీసం రూ 2000 వసూలు చేస్తారు. గతంలో ఇది రూ 500 మాత్రమే ఉండేది. ఇవే నేరాలకు, ఉల్లంఘనలకు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది గనక పాల్పడితే జరిమానాలు రెట్టింపు ఉంటాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత సమావేశాల్లోనే ఈ బిల్లు ప్రవేశపెడతామని కేంద్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.