రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధితో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంపై హై కోర్టు సిరీస్ అయ్యింది. జనం డెంగ్యూ వ్యాధితో మరణిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగ్యూను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి హై కోర్టుకు వివరణ ఇచ్చుకున్నారు. హై కోర్టుకు వివరణ ఇచ్చుకునే క్రమంలో డెంగ్యూను అరికట్టేందుకు ప్రభుత్వం తరపున తగిన నివారణ చర్యలు తీసుకున్నామని సీఎస్ ఎస్కే జోషి కోర్టుకు తెలిపారు. సీఎస్ ఎస్కే జోషి వివరణపై సంతృప్తి చెందని కోర్టు.. నివారణ చర్యలు తీసుకుంటే డెంగ్యూ కేసులు ఎందుకు పెరుగుతున్నాయ్ ? అని నిలదీసింది. మీరు చెబుతున్న మాటలు వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉన్నాయని సీఎస్ ఎస్కే జోషిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
డెంగ్యూ కేసులు పెరుగుతుండటంపై గణాంకాలు వెల్లడిస్తూ.. జనవరిలో 85 డెంగ్యూ కేసులు నమోదైతే అక్టోబర్ నాటికి అవి 3,800లకు పెరిగాయి. డెంగ్యూని అరికట్టడంపై ప్రభుత్వం విఫలమైందనడానికి ఇది నిదర్శనం కాదా అని హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాకుండా డెంగ్యూను అరికట్టడంలో ఒకవేళ ప్రభుత్వం విఫలమైతే మృతుల కుటుంబాలకు రూ.50లక్షలు ఇవ్వాలనే విషయం తెలుసా.. అని హైకోర్టు నిలదీసింది.