ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు చురకలు వేసింది. ప్రభుత్వ కార్యాలకు పార్టీ రంగులు వేసిన విషయంలో వైసీపీకి సర్కార్కు ఈ చురకలు అంటించింది. ఇదేమి సొంత ఆస్తులు కాదుకదా, పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానివని, వాటికి పార్టీ రంగులు ఉండకూదని స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున కార్యాలయాలకు వైసీపీ రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. ఇటీవల పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగు వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇదే కాకుండా జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెలరెగిన దుమారం ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాలు, జాతీయ నాయకుల విగ్రహాలకు పార్టీ రంగులు వేసినట్లు వార్తలు వచ్చాయి.
దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో గుంటూరు జిల్లాలో పంచాయతీ కార్యాలయానికి వైసీపీ రంగు వేశారంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం జనవరి 27 విచారణ జరిపిన ధర్మాసనం. ఘాటుగా స్పందించింది. ఇక ఈ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత తీసుకోవాలని, కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించి, తదుపరి విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది.