తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ రేపటికి వాయిదా పడింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తమకు ఎల్లుండివరకు గడువు కావాలని కోరగా, కోర్టు నిరాకరించింది. రేపు మధ్యహ్నం 2.30 గంటలకు మరోసారి విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. అంతకు ముందు వాదనలు కొనసాగుతున్న సమయంలో.. కార్మికుల సమ్మె కారణంగా ఆర్టీసీకి రూ.175 కోట్ల నష్టం వచ్చిందని అదనపు అడ్వకేట్ జనరల్ అదనపు కౌంటర్ దాఖలు చేశారు.
ఈడీల కమిటీ 21 అంశాలను పరిశీలించి ఆర్టీసీ ఎండీకి నివేదక సమర్పించిందని అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు కోర్టుకు తెలిపారు. ఈ డిమాండ్లలో 18 డిమాండ్లను నెరవేర్చడానికి సరిపడా నిధులు సంస్థ వద్దలేదని ఈడీ నివేదికలో పేర్కొందని రామచంద్రరావు తెలిపారు. ఈడీ కమిటీ నివేదిక తమకెందుకు సమర్పించలేదని కోర్టు ప్రశ్నించింది.