సంచలనం సృష్టించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మైనర్ బాలికపై రేప్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఈ కేసులో నిందితుల డీఎన్ఏ సేకరించడానికి పోలీసులు కోర్టును అనుమతి కోరగా న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిందితుల నుంచి పోలీసులు డీఎన్ఏ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే.. బాలికపై రేప్ జరిగిన ఇన్నోవా కారులో ఆధారాలు సేకరించారు పోలీసులు. డీఎన్ఏ సేకరించిన తర్వాత వాహనంలోని ఆధారాలతో పోల్చనున్నారు. నిందితులు ఇన్నోవా వాహనంలోనే ఉన్నట్లు నిరూపించడానికి డీఎన్ఏ టెస్ట్ కీలకంగా ఉపయోగపడుతుందని పోలీసులు భావిస్తున్నారు. అవసరమైతే బాధితురాలి డీఎన్ఏను సేకరించే యోచనలో ఉన్నారు.
ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.నిందితుల పాస్పోర్ట్లను సైతం సీచ్ చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.నిందితులకు బెయిల్ లభిస్తే దేశం వదిలి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే అరుగురు బెయిల్ పిటీషన్ను కోర్టు తిరస్కరించిన విషయం విదితమే.
కాగా మే 28న మైనర్ బాలికను సాదుద్దీన్ సహా మరో ఐదుగురు యువకులు అత్యాచారం చేశారు.ఈ కేసులో ఐదుగురు మైనర్లతో పాటు ప్రధాన నిందితుడు సాదుద్దీన్ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అందర్ని కొన్ని రోజుల పాటు రిమాండ్లో ఉంచి విచారించారు. ప్రస్తుతం సాదుద్దీన్ చంచల్గూడ జైల్లో ఉండగా.. ఐదుగురు మైనర్లు జువైనల్ హోంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.