ఉగ్రవాదులు తీరం వెంబడి భారత భూభాగంలోకి చొరబడి దాడి చేసే అవకాశాలున్నట్లు నిఘావర్గాల సమాచారం ఉందని నావికాదళ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల్లోనే కాక సముద్ర జలాల్లో పహారా బాగా పెంచామని ఆయన తెలిపారు. ఈ మేరకు ఓ జాతీయ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. రాడార్ల సాంకేతికత ద్వారా, సముద్రంలో అనుమానాస్పద నౌకల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, కీలక ప్రాంతాల్లో నౌకాదళాన్ని మోహరింపజేశామని ఆ అధికారి వెల్లడించారు.
భారత నేవీ శత్రువులను సులువుగా తెలుసుకొనేలా దేశంలో 2.5 లక్షల వరకూ ఉన్న 20 మీటర్ల కన్నా ఎత్తున్న మత్స్యకారుల పడవలన్నింటికీ ఓ ట్రాకింగ్ వ్యవస్థను బిగించాలని తాము ప్రభుత్వాన్ని కోరినట్లు నౌకాదళ అధికారులు తెలిపారు. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంపై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఖామర్ జావెద్ బజ్వా చేసిన వ్యాఖ్యలను అధికారులు ప్రస్తావించారు. కశ్మీర్ ప్రజల బాగు కోసం తాము ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నామని గతంలో ఆయన వ్యాఖ్యానించారు. జైష్-ఎ-మహమ్మద్ నాయకుడు మసూద్ అజర్కు సోదరుడైన ఉగ్రవాది రహుఫ్ అజర్ ఈ మధ్య పాక్ ఆక్రమిత కశ్మీర్లో తిరుగుతున్నాడని నిఘా వర్గాలు పేర్కొన్న సంగతి తెలిసిందే.