తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాల జోరు మొదలయింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణితో పాటు.. బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపుతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD అధికారలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కొమ్రంభీం అసిఫాబాద్, పెద్దపల్లి, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, హైదరాబాద్, జనగామ, హన్మకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది.
ఇకపోతే..ఆంధ్రప్రదేశ్లో మూడు రోజుల పాటు ఉరుములతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు శనివారం ఏర్పడిన ‘ఉపరితల ద్రోణి’ ప్రస్తుతం సగటు సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల ఉరుములతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అమరావతి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.