*భద్రాచలానికి వరద ముప్పు
*భద్రాచలాన్ని నలువైపులా చుట్టుముట్టిన వరద
*628 గ్రామాలపై వరద ప్రభావం..ప్రజలు భయం భయం
*లంక గ్రామాలను హడలెత్తస్తున్న వరద ఉదృతి..
*ధవళేశ్వరం వద్ద పొంచి ఉన్న ముప్పు
*కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గంటగంటకు పెరుగుతున్న వరదతో ప్రజలు భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికే ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రజలు ముప్పుతిప్పలు పడుతున్నారు. 36 ఏళ్ల తర్వాత నీటిమట్టం 71 అడుగులు దాటింది.
వరద ప్రవాహ ఉద్ధృతి పెరిగితే.. దాదాపు 630కు పైగా గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. మొత్తం 6 జిల్లాల్లోని 44 మండలాల్లో 628 గ్రామాలపై వరద ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇన్ ఫ్లో తగ్గట్టుగా నీటిని దిగువకు వదులుతున్నారు.
అయితే గోదావరి నదికి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దాదాపు 25 లక్షల క్యూసెక్కుల వరకు వస్తుండొచ్చని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ధవళేశ్వరం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 23.20 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను ఇంకా కొనసాగిస్తున్నారు.
ముందస్తు చర్యల్లో బాగంగానే ముంపు ప్రభావిత ప్రాంతాల అధికారులను, ప్రజలను అప్రమత్తం చేశారు. సంబంధిత అధికారుల యంత్రాంగం తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. క్షేత్ర స్థాయిలో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.