చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది.అయితే కరోనా వైరస్ మహమ్మారి ముప్పు నుంచి తప్పించుకోవాలంటే మాస్కు ధరించడం కచ్చితం. ఇటీవల శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో వైరస్ నుంచి మరింత సురక్షితంగా ఉండడం కోసం డబుల్ మాస్క్లను ధరించాలని సూచనలు చేశారు. నిపుణుల ప్రకారం.. డబుల్ మాస్క్ వేసుకోవడంతో కొంతమేరకు వైరస్ వ్యాప్తి జరిగే ప్రభావాన్ని తగ్గించవచ్చునని తేలింది.కాగా తాజాగా డబుల్ మాస్క్ వాడకంపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఒకే రకమైన రెండు మాస్క్లను డబుల్ మాస్క్గా వాడొద్దని కేంద్రం స్పష్టం చేసింది. డబుల్ మాస్క్ను ధరించేటప్పుడు సర్జికల్ మాస్క్, క్లాత్ మాస్క్ కలిపి ధరించాలని కేంద్రం సూచించింది. అంతేకాకుండా ఒకే మాస్క్ను వరుసగా రెండ్రొజులు పాటు వాడొద్దని కేంద్రం తెలిపింది.
సాధారణ క్లాత్మాస్క్ 42 నుంచి 46 శాతం వరకు రక్షణ కల్పిస్తుందని అధ్యయనకర్తలు వెల్లడించారు. సర్జికల్ మాస్కు అయితే 56.4 శాతం రక్షణ ఇస్తుందన్నారు. సర్జికల్ మాస్కుపై క్లాత్మాస్కు ధరిస్తే కరోనా నుంచి రక్షణ 85.4 శాతం వరకు ఉంటుందన్నారు.